ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం శివసేనలో చీలికకు దారి తీసింది. శివసేన భిన్నాభిప్రాయాలతో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం బిజెపికి మద్దతు ఇచ్చి, ప్రస్తుత పరిస్థితికి స్వస్తి పలకాలని కోరుతుంటే, మరొక వర్గం 50-50 ఫార్ములా అమలు చేసి తీరాల్సిందేనని పట్టబడుతోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బిజెపి – శివసేన పార్టీలు ఆ తరువాత మొండిగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. శివసేన 50-50 ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీని ప్రకారం రెండున్నర సంవత్సరాలు శివసేన నేత ముఖ్యమంత్రిగా ఉంటారు. మరొక రెండున్నరేళ్లు బిజెపి నేత ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే దీనిని బిజెపి నిర్ద్వందంగా తిరస్కరించింది. మహారాష్ట్రలో అధికారం తామే చేపడతామని, దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తారని బిజెపి పేర్కొంటున్నది.