ఎపి సిఎం జగన్ను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలని జనసేనాని పవన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇసుక కొరతతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు ఉసురు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతంటూ, ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ నవంబర్ 3న విశాఖ లాంగ్ మార్చ్కు ఆయన పిలువు ఇచ్చారు కూడా. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఆ పార్టీ.
అయితే ఈ లాంగ్ మార్చ్ వెనుక పవన్ చాలా వ్యూహాత్వకంగా వ్యవహరిస్తున్నాడని , జగన్ను ఎదుర్కోవడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదు కనుక గతంలోలానే ఇప్పుడుకూడా బీజేపీ, టీడీపీలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భవన నిర్మాణ కార్మికుల సమస్యపై పోరాటమే సరైన మార్గమని అంతా భావిస్తున్నా, భవన నిర్మాణ కార్మికుల పేరుతో కూటమి నిర్మాణం చేయాలనే ఆలోచనకు పవన్ శ్రీకారం చుట్టేలా ఉందని విశ్లేషకులుచెపుతున్న మాట. ఇప్పటికే పవన్ లాంగ్మార్చ్కు బీజేపీ ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, తెలుగుదేశానికి కూడా పవన్ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రాజకీయ పార్టీల మధ్య సమస్యల ప్రాతిపదికన ఏర్పడిన స్నేహ బంధాలు ఎన్నికల సమయంలో పొత్తులకు దారి తీసే అవకాశాలు ఎక్కువగాఉంటాయి. తాజాగా భవన నిర్మాణ కార్మికుల మాటున ఏర్పడే మహాకూటమి నిర్మాణం కూడా ఇలాంటిదేనన్నది విశ్లేషకుల మాట. మరి ఏం జరగనుందో చూడాలి.