కేంద్రమంత్రి అమిత్షాకు టీడీపీ నేత చంద్రబాబు లవ్ లెటర్లు ఎందుకు రాస్తున్నారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. తప్పులు చేయడం చంద్రబాబుకు కొత్త కాదని, మాజీ సీఎం ఎన్టీఆర్పై పోటీ చేస్తానన్న చంద్రబాబు.. ఓడిపోయాక ఆయన చెంతకే చేరారని ఎద్దేవాచేశారు. ముందు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని, తర్వాత జుట్టుపట్టుకున్నారని, ఇప్పుడు మళ్లీ బీజేపీతో దూరం అవడం తప్పు అంటున్నారని నాని విమర్శించారు. చంద్రబాబే తన మనుషుల్ని బీజేపీలో చేర్చారని, గతంలో ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్ష చేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్ను వ్యతిరేకించడమే పవనిజమని, చంద్రబాబు చెప్పిందే జనసేన అధినేత పవన్ మాట్లాడుతారని ఆరోపించారు. జగన్పై దాడి జరిగితే.. కోడికత్తి అని అవహేళన చేస్తారా అని ఆయన మరోసారి ప్రశ్నించారు. అమెరికాలో బేరం కుదర్చుకుని పవన్ సీట్లు ఇచ్చారని పేర్నినాని దుయ్యబట్టారు.