విద్యుత్ వాడుకొని బిల్లు కట్టకుండా మొరాయిస్తున్న వారికి చెక్ పెట్టడానికి యూపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అనూప్ చంద్రపాండే ఆదేశాలతో కరెంటు బిల్లులు వసూలు కోసం జౌన్పూర్ జిల్లా కలెక్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సకాలంలో కరెంటు బిల్లలు కట్టని వారికి సబ్సిడీ రేషన్ సహా ప్రభుత్వ పథకాలేవీ ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ అర్వింద్ మల్లప బంగారి ఇప్పటికే జిల్లాలోని ముఖ్య అధికారులందరికీ సమాచారం పంపారు.
అక్టోబర్ 1 నుంచి కరెంటు బిల్లు కట్టినట్టు రశీదు చూపించకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కర్ని కూడా ఉపేక్షించబోదని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ విద్యుత్ కార్పొరేషన్ భారీ నష్టాల్లో కూరుకుపోవడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైందన్నారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. కాగా ఇటీవల యూపీ కలెక్టర్లతో తన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా.. విద్యుత్ బకాయిల వసూలుకు వినూత్న నిర్ణయాలు తీసుకోవాలంటూ సీఎస్ ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనూ గోరక్పూర్ వంటి జిల్లాల్లో కూడా కరెంటు బిల్లుల వసూలుకు ఇదే తరహా నిర్ణయాలు అమలు చేస్తున్నారు.