అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో బాంబు పేలుడుతో దద్దరిల్లింది. కాబూల్ లోని హెడ్ క్వార్టర్ వద్ద 2019, ఆగస్టు 07వ తేదీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. ఈ ఘటనలో 95 మందికిపైగా గాయాలపాలయ్యారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు.గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు పేలుడుకు పాల్పడ్డారని సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు. ఓ వ్యక్తి బాంబులు అమర్చుకుని తనుకు తాను పేల్చుకున్నాడని వెల్లడించింది.
హెడ్ క్వార్టర్ వద్ద రద్దీగా ఉన్న సమయంలో దాడి జరిగింది. ఆ ప్రాంతమంతా బీభత్సంగా తయారైంది. హాహాకారాలు మిన్నంటాయి. తమ వారు ఎలా ఉన్నారోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 95 మందికి గాయాలయ్యాయని..ఇందులో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులు ఉన్నారని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపడుతున్నారు