బెంగళూరు: కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ మంగళూరు నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ కోసం పోలీసులు నదిని జల్లెడ పట్టగా ఇవాళ నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. కాగా మైండ్ట్రీ లిమిటెడ్ కంపెనీతో తాను జరిపిన లావాదేవీల్లో అవకతవకలున్నాయని చెప్పి ఐటీ, ఈడీలు వేధించాయని సిద్ధార్థ రాసినట్లుగా ఉన్న ఓ లేఖ కూడా ఇప్పటికే పోలీసులకు లభ్యమైంది. వీజీ సిద్ధార్థది, తనది దాదాపుగా ఒకే విషయమని, అతను ఒక గొప్ప వ్యాపారవేత్త అని మాల్యా ఇవాళ ట్వీట్ చేశాడు. అతను రాసిన లెటర్ తనను కలవరానికి గురిచేసిందన్నాడు. తాను తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లిస్తానని చెప్పినా బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు తన పట్ల క్రూరంగా, దుర్మారంగా ప్రవర్తిస్తున్నాయని మాల్యా అన్నాడు. పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలను తీర్చేందుకు సహాయం చేస్తాయని, కానీ తన విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందన్నాడు. కాగా మాల్యా ఇప్పటికే భారత్లో బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగనామం పెట్టిన కేసులో యూకేలో విచారణ ఎదుర్కొంటున్నాడు. భారత అధికారులు మాల్యాను ఇక్కడికి రప్పించే పనిలో ఉన్నారు. అయితే ఈ మొత్తం విషయం తెలుసుకున్న విజయ్మాల్యా జరిగిన ఘటనపై ట్విట్టర్లో స్పందించాడు.