కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతూ ఉండటంతో కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. ఆల్మట్టితో పాటు నారాయణపూర్ నుంచి కూడా నీటిని వదలడంతో, ఆ నీరు గత అర్ధరాత్రి జూరాల జలాశాయానికి చేరింది. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, నేడు వరద నీరు లక్ష క్యూసెక్కులను దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన ఇంకా వర్షాలు పడుతూ ఉండటంతో, రెండు రోజుల్లోనే జూరాల నిండి, శ్రీశైలానికి వరదనీటి విడుదల ప్రారంభం అవుతుందని సమాచారం.