ఇటీవల వైసిపి గెలుపుకు ఆ పార్టీ వ్యూహకర్త పీకేను దేశ వ్యాప్తంగా పలువురు నేతలు సంప్రదిస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ని సంప్రదించినట్టు వస్తున్న వార్తలను తెలుగుదేశం పార్టీ కొట్టి పారేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఈ వ్యవహారంపై మీడియా వేసిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ప్రశాంత్ కిషోర్ను టీడీపీ సంప్రదించినట్లు వస్తున్న వార్తలు అన్నీ పుకార్లేనని.. అసలు మేం ఇంతవరకూ ఎవర్నీ సంప్రదించలేదని తేల్చి చెప్పారు. కార్యకర్తలను పక్కదోవ పట్టించడం ద్వారా తెలుగుదేశం నుంచి బైటకు రప్పించి తమ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్న కొందరు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు పుంఖనాలుగా సృష్టిస్తున్నారని, వీటిని టీడీపీ కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని, ఎవరు ఈ విషయం ప్రస్తావించినా వెంటనే ఖండించాలని ఆయన కోరారు.