తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ వర్షాలు కురిసి పాడిపంటలు, పశుపక్ష్యాదులతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. అందరూ ధర్మబద్ధంగా ఉండాలని కోరారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపైనా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.