టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఒంటిమిట్టలో నిర్వహించనున్న కల్యాణానికి వచ్చే భక్తుల ఏర్పాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లలో టీవీల్లో పిల్లలకు ఉపయోగపడేలా కార్టూన్, యానిమేషన్్ చిత్రాలు, శ్రీవారి పౌరాణిక ప్రాశస్త్యాన్ని, తిరుమల, తిరుపతిలోని ఆలయాలు, వాటి దూరం, ఎలా వెళ్లాలి అనే విషయాలను తెలిపేలా కథనాలను ప్రసారం చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భూగర్భ కేబుళ్లను మే చివరి నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్, ఎస్వీబీసీ అధికారులను ఆదేశించారు. అలిపిరి నడక మార్గంలో నాటిన 10 వేల మొక్కలను సంరక్షించాలని, మొదటి ఘాట్ రోడ్డులో ఇరువైపులా నాటిన మొక్కలు బాగా పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తిరుమల, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులపై ఈవో సమీక్షించారు. అమరావతి, కన్యాకుమారి, కురుక్షేత్ర, అరకు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరంలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల ప్రగతికి సంబంధించిన ఫొటోలను వచ్చే సమావేశంలో చూపాలన్నారు. అప్పలాయగుంటలో జరుగుతున్న పనులను స్వయంగా వచ్చి పరిశీలిస్తామన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వెనుకవైపు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశం గురించి ఎక్కువ మంది భక్తులకు తెలిసేలా ఆలయంలో ఫ్లెక్సీ బోర్డుల ఏర్పాటుతోపాటు అనౌన్స్మెంట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీచంద్రశేఖర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.