మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న 40ఏళ్ల మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ మెట్రో రైలు క్యారేజీ డోర్ లో మహిళ శారీ ఇరుక్కుపోవడంతో ప్లాట్ ఫాంపై కొంతదూరం రైలు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఢిల్లీలోని మోతీనగర్ మెట్రో స్టేషన్ లో బ్లూ లైన్ పై ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మెట్రో ట్రైన్ లో నవాడా నుంచి గీత (40) తన కుమార్తెతో కలిసి ప్రయాణిస్తోంది.
మోతీ నగర్ మెట్రో స్టేషన్ చేరుకున్న సమయంలో ఆమె రైలు నుంచి ప్లాట్ ఫాంపై దిగబోయింది. ఈ క్రమంలో ఆమె శారీ క్యారేజీ డోర్ లో ఇరుక్కుపోయింది. ఇంతలో ట్రైన్ డోర్ క్లోజ్ అయింది.. కదిలిన మెట్రో రైలు ఆమెను ప్లాట్ ఫాంపై కొంతదూరం ఈడ్చుకెళ్లినట్టు గీత భర్త జగదీశ్ ప్రసాద్ తెలిపాడు. గీత తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినట్టు ప్రసాద్ చెప్పాడు.ట్రైన్ కదిలినప్పుడు ప్రయాణికుల్లో ఒకరు ఎమర్జెన్సీ బటన్ నొక్కడంతో అప్రమత్తమైన మెట్రో ట్రైన్ డ్రైవర్.. రైలును నిలిపినట్టు అతడు చెప్పాడు. తన కుమార్తె ఫోన్ కాల్ చేయడంతో మెట్రో స్టేషన్ కు చేరుకున్నట్టు తెలిపాడు. మోతీనగర్ మెట్రో స్టేషన్ లో జరిగిన ఈ ఘటనను సీనియర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)అధికారి కూడా ధ్రువీకరించారు.
ఈ ఘటనతో మోతీ నగర్, రాజేంద్ర ప్లేస్ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినట్టు డీఎంఆర్ సీ ట్వీట్ చేసింది. బ్లూ లైన్ ఢిల్లీ మెట్రో.. ద్వారక నుంచి నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో సర్వీసులు నడుపుతోంది.