పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారని మోహన్ బాబు ఆరోపించారు. నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు అన్న మోహన్ బాబు.. జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. అంతేకాదు.. త్వరలోనే జనసేన జెండా పీకేస్తారని మోహన్ బాబు అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరుఫున ప్రచారం చేస్తున్న మోహన్ బాబు తిరుపతిలో మాట్లాడారు. పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని మోహన్ బాబు అన్నారు. ఆయన చరిత్ర ఏంటో చెప్పే పుస్తకం తన దగ్గర ఉందన్నారు. తాను ఏమీ ఆశించకుండానే వైసీపీలో చేరానని మోహన్ బాబు స్పష్టం చేశారు.
చంద్రబాబు ఓటమే తన ధ్యేయం అని మోహన్ బాబు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుని గజదొంగగా అభివర్ణించారు. బాబు ఐదేళ్ల పాలన దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగిపోయిందన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తే వేస్ట్ అయిపోతాయన్నారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ఘాటు విమర్శలు చేవారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశమిస్తే రాష్ట్రం అథోగతేనంటూ మోహన్ బాబు హెచ్చరించారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని కొన్ని పార్టీలు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని ఓటర్లను మోహన్ బాబు కోరారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన అంత మోసగాడు రాష్ట్రంలోనే ఎవరూ లేరని మండిపడ్డారు. ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని మోహన్ బాబు జోస్యం చెప్పారు.