చింతలపూడి నియోజకవర్గంలో పీతల సూజాత ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, అందుకే కొత్త వారికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారని సొంత పార్టీ నేత అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంబికా కృష్ణ పై పీతల సుజాత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఏలూరులోని మీడియా సమావేశంలో పీతల సుజాత మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. అంబికా కృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. అంబికా పై వ్యక్తిగత వ్యాఖ్యలు మాట్లాడటం లేదని, ఆ సంస్కారం తనకు ఉందని సుజాత చెప్పారు. తనకు చింతలపూడిలో సీటు రాలేదన్న బాధ లేదన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, చంద్రబాబు ఎక్కడ ప్రచారం చేయమంటారో.. అక్కడ ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. దళిత మహిళ అయిన తనపై అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని వాపోయారు. అంబికా కృష్ణ వైసిపితో లాలూచిపడి తనను విమర్శలు చెయ్యడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తనను ఇంకోసారి ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే చెంప చెళ్ళుమనిపిస్తానని సుజాత హెచ్చరించారు.