హైదరాబాద్ : వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అనంతరం జీవితా రాజశేఖర్ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే జగన్ సీఎం కావాలన్నారు. గతంలో జగన్తో విభేదాలు ఉన్న మాట వాస్తమేనని, అప్పుడున్న జగన్ వేరు.. ఇప్పుడున్న జగన్ వేరు అని వారు పేర్కొన్నారు. మొత్తానికి వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు. జగన్ జనం వెంటే నడుస్తున్నారని, ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు. 2009లో జీవిత, రాజశేఖర్ వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీలో జగన్ సమక్షంలో చేరారు. జగన్తో విభేదాల కారణంగా వైసీపీని వీడి.. బీజేపీలో చేరారు. అనంతరం కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న రాజశేఖర్ దంపతులు గతేడాది చంద్రబాబును కలిసి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలో చేరారు.