నవ్యాంధ్రలో అధికారం సాధిస్తామని, 85 నుంచి 125 మధ్య సీట్లు సాధించి జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. ప్రజల్లోని నిశ్శబ్ద విప్లవం జనసేనకు మేలు చేయనుందన్నారు. ఈరోజు ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు జనసేనతో రావాలని ఆశిస్తున్నారని చెప్పారు. పౌరుల భవిష్యత్తు కోసం జనసేన మేనిఫెస్టో రూపకల్పన చేసిందని, అది ప్రజల్ని ఆకర్షిస్తోందని చెప్పారు. విశాఖ సమస్యలను గుర్తించానని తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు తీవ్ర నీటి సమస్యతో బాధపడుతున్నారని, దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టనున్నట్లు ప్రజలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అలాగే వైద్య సేవలు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.