పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) క్రికెట్ ప్రసారాల నుంచి వైదొలుగుతున్నట్లు ఐఎంజీ రిలయన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఐఎంజీ రిలయన్స్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దాడిని తీవ్రంగా ఖండించిన సంస్థ తక్షణమే పీఎస్ఎల్ ప్రసారాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది. భద్రతా కారణాలరీత్యా ప్రస్తుతం టోర్నీని యూఏఈలో నిర్వహిస్తుండగా.. నాకౌట్ మ్యాచ్లను పాకిస్థాన్లోని లాహోర్, కరాచీలలో నిర్వహించనున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్లను ప్రసారం చేసేందుకు ఐఎంజీ రిలయన్స్ గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. అటు ప్రసారాల నుంచి రిలయన్స్ తప్పుకున్నట్లు అధికారికంగా ధ్రువీకరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మరో సంస్థ కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది.