న్యూఢిల్లీ: పుల్వామా దాడిని అఖిల పక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల పక్ష పార్టీ భేటీ జరిగింది. పుల్వామా దాడిని ఖండిస్తున్న అఖిల పక్షం ఓ ప్రకటనలో వెల్లడించింది. జవాన్ల కుటుంబసభ్యులకు అండగా ఉండాలని తీర్మానించాయి. ఉగ్రవాదాన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నట్లు అఖిలపక్ష పార్టీలు వెల్లడించాయి. ఉగ్రవాదంపై పోరాటానికి ఐక్యంగా నిలిచి ఉన్నామని అఖిలపక్షం పేర్కొన్నది. దేశభద్రత కోసం ప్రభుత్వంతో కలిసి ఐక్యంగా నిలిచి ఉన్నామని కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. కశ్మీర్ అయినా లేక ఇతర ప్రాంతమైనా, ఉగ్రదాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ఉగ్రపోరాటంపై ప్రభుత్వానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో ప్రధాని సమావేశం కావాలని రాజ్నాథ్ను కోరినట్లు గులాం నబీ ఆజాద్ తెలిపారు. అన్ని పార్టీలు ఈ అభిప్రాయానికి మద్దుతు ఇచ్చాయన్నారు. యావత్ దేశం ఆగ్రహంగా ఉందన్నారు. దేశ ప్రజలంతా భద్రతా దళాలకు అండగా ఉన్నారన్నారు.