జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో నిన్న ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. ఆర్థిక సాయం, ఉద్యోగం తదితర సాయాలను ప్రకటిస్తున్నాయి. అమరుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల వారు ఉన్నారు.తమ రాష్ట్రానికి చెందిన అమరజవాన్ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, బాధిత కుటుంబాల నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే అమర జవాన్ల స్వగ్రామాల వెళ్లే రహదారులకు వారి స్మృత్యర్థం వారి పేర్లను పెడతామని తెలిపారు. పుల్వామా అమరుల్లో అత్యధికంగా 12 జవాన్లు ఉత్తరప్రదేశ్కు చెందినవారే ఉన్నారు.