ప్రసిద్ధ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా తనయుడు తేజ్ భూపేన్ హజారికా శాంతించారు. భూపేన్ హజారికాకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను స్వీకరించేందుకు ఆయన అంగీకరించారు. వివాదాస్పద పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోకుంటే ‘భారతరత్న’ పురస్కారాన్ని స్వీకరించబోనని ఆయన ప్రకటించినట్లు గత వారం కథనాలు వెలువడ్డాయి. దీనిపై వివరణ ఇచ్చిన తేజ్ హజారికా...ఫేస్బుక్లో తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురైనట్లు చెప్పారు. భారత ప్రభుత్వం తమను పురస్కార స్వీకరణకు ఆహ్వానించడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశ సమగ్రత కోసం సేవలందించిన తన తండ్రి తరఫున భారతరత్న పురస్కారాన్ని స్వీకరించాలన్నది తన చిరకాల స్వప్నంగా పేర్కొన్నారు. తన తండ్రి తరఫున భారతరత్న పురస్కారాన్ని స్వీకరించేందుకు రావాలని భారత ప్రభుత్వం తనను ఆహ్వానించినట్లు న్యూయార్క్ నుంచి ఆయన పీటీఐకి విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. తన తండ్రి తరఫున ఈ పురస్కారాన్ని స్వీకరించడం తనకు, తమ కుటుంబానికి గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు.