ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. సీబీఐకి సుప్రీంకోర్టు వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 11:50 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఉపశమనం లభించింది. సీబీఐ జారీచేసిన లుకౌట్ నోటీసులను బాంబే హైకోర్టు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్దించింది. ఈ సందర్భంగా సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇమ్మిగ్రేషన్ బ్యూరోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు ఉన్నత కుటుంబానికి చెందినవారు కావడంతోనే బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేశారని ఆరోపించింది. ఇదో పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే విశ్వనాథన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.


‘మేము హెచ్చరిస్తున్నాం.. నిందితుల్లో ఒకరు ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇటువంటి పనికిమాలిన పిటిషన్ వేశారు.. దీనిని మేము తిరస్కరిస్తున్నాం.. ఇద్దరు వ్యక్తులు సమాజంలో ఉన్నతమైన మూలాలను కలిగి ఉన్నారు.. మూడున్నరేళ్లుగా ఈ కేసు పురోగతికి సహకరిస్తున్న రియాపై లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం సమంజసం కాదు.. నోటీసు ఇవ్వడంతో హేతుబద్ధత కనిపించడం లేదు’ అని జస్టిస్ గవాయ్ మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన అపార్ట్‌మెంట్‌లో జూన్ 2020లో శవమైన కనిపించాడు. అయితే, ఇది హత్య? ఆత్మహత్య? అనేది తెల్చేందుకు అనుమాస్పద మరణం కింద కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. సుశాంత్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుకాగా.. తర్వాత సీబీఐకి బదిలీ చేశారు.


ఈ కేసులో నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఆమె తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజీత్ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తిపై సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. వీటిలో బాంబే హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానంలో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. నోటీసుల జారీకి ఎటువంటి కారణాలు లేవని కొట్టివేసింది. అంతేకాకుండా, నటి, ఆమె కుటుంబానికి సమాజంలో గుర్తింపు ఉందన్న కోర్టు.. దర్యాప్తు సంస్థలకు కూడా సహకరించారని సూచించింది.


అదే ఏడాది రియా చక్రవర్తి, కుటుంబసభ్యులు మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేయించుకుని, ఆత్మహత్యకు కారణమయ్యారని అతడి కుటుంబసభ్యులు ఆరోపించడంతో రియా ఆదాయ మార్గాలు, పెట్టుబడులు, ఒప్పందాలపై ఈడీ దృష్టిపెట్టింది. చనిపోయే సమయానికి రియా, సుశాంత్ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com