ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పింఛన్‌లపై మరో శుభవార్త.. ఇకపై చాలా ఈజీగా, ఆరంచెల విధానం రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 09:29 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధిదారుల అర్హత నిర్ణయించేందుకు అనుసరించిన ఆరంచెల పరిశీలనకు గుడ్ బై చెప్పారు. ఈ విధానం ఇకపై ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతుందని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో అర్హత లేకపోయినా చాలామందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు మంత్రులతో కమిటీ వేయాలని ముందు అనుకున్నారు.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టారు. ఈ ఫిర్యాదుల్నిగ్రామసభ ముందుంచి, అప్పుడు నిర్ణయించాలని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానించారు.


గత ప్రభుత్వం హయాంలో ఫించన్లకు సంబంధించి ఆరంచెల విధానం అమలు చేశారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఈ ఆరంచెల విధానం తలనొప్పిగా మారింది. దీంతో చంద్రబాబు సర్కార్ ఈ విధానానికి స్వస్తిపలికారు.. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. డిసెంబర్ నెలాఖరులోపు ఈ పింఛన్ల దరఖాస్తుల్ని ఫైనల్ చేసి జనవరి నుంచి పింఛన్లను అందించనున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలతో పింఛన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి.. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల పింఛన్లను తనిఖీ చేయనున్నారు. అలాంటివారికి 45 రోజుల్లోగా నోటీసులు ఇస్తారు.. గ్రామ సభల్లో చర్చించిన తర్వాత ఆ పింఛన్లపై నిర్ణయం తీసుకుంటారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్‌ అందిస్తామని.. తప్పుడు పత్రాలతో పింఛన్ పొందినవారిపై మాత్రం వేటు తప్పదంటున్నారు.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌లను పెంచింది. గతంలో రూ.3వేలుగా ఉన్న పింఛన్‌లను రూ.4వేలకు పెంచింది. జూన్‌ నెల నుంచి ఇంటి దగ్గరకే పింఛన్‌ పంపిణీ చేస్తోంది.. గత ప్రభుత్వంలో వాలంటీర్లతో పంపిణీ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పింఛన్‌లను పంపిణీ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకునేందుకు సిద్ధమవుతుంది.


మరోవైపు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా.. సిలిండరు కొనుగోలు చేసిన 48గంటల్లోగా సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారు అకౌంట్‌లలో ప్రభుత్వం జమచేస్తుందని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర ప్రతిపాదన తీసుకొచ్చారు. రాష్ట్రంలో పింఛన్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నట్టే.. సిలిండరు కూడా అందిస్తే బావుంటుందని కేబినెట్ భేటీ సమయంలో సూచించారు. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలో డబ్బు వేయడం కంటే ఇలా చేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నారు. తనకూ అలాంటి ఆలోచన ఉందని.. కానీ ఐదు రాష్ట్రాలు బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తున్నాయని.. ప్రస్తుతానికి అదే విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మార్పులపై తర్వాత ఆలోచిద్దామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com