ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి రైల్వే స్టేషన్‌లో గంటన్నర హైడ్రామా.. భార్యాభర్తల కేకలు, ఏమైందంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 07:45 PM

తిరుపతి రైల్వే స్టేషన్‌లో భార్యాభర్తలు కొద్దిసేపు టెన్షన్ పడ్డారు. సాంకేతిక సమస్యతో లిఫ్ట్ ఆగిపోవడంతో.. అందులో ఇరుక్కుపోయారు. ఊపిరాడక కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సాయిబాబు, రజిని దంపతులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. మొదటి గేట్ నుంచి లిఫ్ట్‌లో ఎక్కారు.. అయితే లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ లిఫ్ట్‌ ఎంతకీ తెరుచుకోక పోవడంతో వారిద్దరు కొద్దిసేపు టెన్షన్ పడ్డారు.. లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో దంపతులు పెద్దగా కేకలు వేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో 108కి కాల్ చేశారు.. వారు రైల్వే స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


కొద్దిసేపటి తర్వాత రైల్వే సిబ్బంది టెక్నీషియన్‌ను పిలిపించగా.. మరమ్మతులు చేయడంతో లిఫ్ట్ కిందకు వచ్చింది. దీంతో వారిద్దరు సురక్షితంగా బయటపడగా.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ 2 గంటల పాటూ వారిద్దరు లిఫ్ట్‌లోనే ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. అయితే రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ ఆగిపోతే ఎవరికి ఫోన్ చేయాలో కూడా కనీసం సమాచారం లేదని దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో 108కి కాల్ చేశామంటున్నారు. వారిద్దరు చీరాలకు తిరిగి వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేసుకోగా.. ఆ రైలు కూడా వెళ్లిపోవడంతో వారిద్దరు ఇబ్బందిపడ్డారు.


మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే పెండింగ్‌ భూసేకరణ తదితర పనుల్లో కదలిక మొదలుకాబోతోంది. తిరుపతి కేంద్ర ప్రతి రోజూ 130 వరకు రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్


రీ-డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అంతేకాదు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా చిత్తూరు, రేణిగుంట, కుప్పం, పాకాల, శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేట స్టేషన్లను దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు. కుప్పం డిజైన్‌లో మార్పులు చేపట్టి మరిన్ని నిధులు తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి అడుగులుపడుతున్నాయి.


గ్రామాల్లో అండర్‌ పాస్‌లు, ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఏర్పేడు-పూడి స్టేషన్ల మధ్య 25.36 కి.మీ మేర బైపాస్‌ లైన్‌ నిర్మించాలని ప్రతిపాదన కూడా ఉంది. రేణిగుంట స్టేషన్‌ సమీపంలో 72 ఎల్‌సీ నంబర్‌ వద్ద లెవల్‌ క్రాసింగ్‌ వద్ద బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో భూసేకరణకు రూ.20 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. డక్కిలి మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా.. భూములు ఇచ్చిన వారికి ఇంకా పరిహారం అందలేదు. వీరికి త్వరలోనే చెల్లింపులు చేయనున్నారు. అలాగే కొత్త మార్గాల్లో గూడూరు-దుగరాజపట్నం, తడ-శ్రీకాళహస్తి వరకు విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com