ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, వారికి 20 ఏళ్ల కల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 07:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలు మార్గం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పటి నుంచో ప్రతిపాదనలకే పరిమితమైన ఉత్తరాంధ్ర-ఒడిశా రైలు మార్గం ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడితో కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలిశారు. ఉత్తరాంధ్ర-ఒడిశా రైలుమార్గం ఏర్పాటు చేయాలని విన్నవించారు.. ఈ క్రమంలో రైల్వేశాఖ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర-ఒడిశా కొత్త రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.


ఈ ఉత్తరాంధ్ర- ఒడిశా కొత్త రైలు మార్గాన్ని ప్రధానంగా గిరిజన ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించారు. అంటే చీపురుపల్లి, రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరుతో పాటు ఒడిశాలోని పర్లాఖిమిడి ప్రాంతాలు కలిపి.. మెళియాపుట్టి నుంచి పలాస లైన్‌కు కలుపుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే.. రవాణా సులువుగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా వరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉందంటున్నారు.


అంతేకాదు గిరిజన ప్రాంతాల నుంచి ఒడిశా వైపు వెళ్లాలంటే బస్సులపై ఆధారపడాలి.. కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. అదే రైలు మార్గం ఉంటే ఆర్థిక భారం తగ్గుతుందంటున్నారు.


ఈ కొత్తు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఏపీ-ఒడిశాల మధ్య అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలు పెరుగుతాయంటున్నారు. ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకుకూడా ఉపాధి అవకాశాలు ఉంటాయంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఉత్తాంధ్రకు కీలకమైన ఈ రైలు మార్గంపై కేంద్రానికి విన్నవించారు.. త్వరలోనే ఈ రైలు మార్గంపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కొత్త రైలు మార్గంపై చొరవ చూపడాన్ని స్వాగతిస్తున్నామని చెబుతున్నారు స్థానికులు.


గిరిజన ప్రాంతాలను కలుపుతూ.. కొత్త రైలు మార్గం ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి రావడం ఆనందంగా ఉందంటున్నారు. గిరిజనులు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉంటుందని.. కేంద్రం త్వరగా నూతన రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


ఉత్తరాంధ్ర-ఒడిశా కొత్త రైలు మార్గంపై తొలి అడుగు పడింది అన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. 20 ఏళ్లుగా ఇక్కడ ప్రజలు కోరుతున్నా అడుగులు ముందుకు పడలేదని.. ఇప్పుడు కేంద్రం నుంచి సాధించుకునే అవకాశం ఉండడంతో.. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారిద్దరు కూడా వెంటనే స్పందించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో ఈ కొత్త రైలు మార్గంపై


శుభవార్త ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com