ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి రైల్వే ప్రాజెక్టు ప్రకటించడం హర్షణీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2024, 09:37 PM

 కృష్ణానదిపై రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలిపారు. అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి రైల్వే ప్రాజెక్టు ప్రకటించడంతో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో వర్చువల్‌గా సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతి రైల్వే లైన్‌‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఇండియాలోని అన్ని రాష్ట్ర రాజధానులను కలుపుతూ ఈ లైన్ ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తికానుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రైల్వేస్టేషన్లలో జరుగుతున్న పనులను కూడా వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


ఏపీకి ఈ ప్రాజెక్ట్ మరింతగా ఉపయోగ పడుతుందని అన్నారు. భూసేకరణ ఇతర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు శ్రీనివాస్, లావు కృష్ణదేవరాయలు, తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది. అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు అనుసంధానిస్తూ కొత్త లైన్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో మధ్య, ఉత్తర భారతంతో దక్షిణ భారతదేశం అనుసంధానం మరింత సులువుకానుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహల గుండా రైల్వే మార్గం ఉండనుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ నిర్మాణం కొనసాగనుంది. ఈ లైన్‌ నిర్మాణం ద్వారా కూలీలకు 19 లక్షల పనిదినాలు ఉపాధి కల్పన జరగనుంది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు 25 లక్షల చెట్లు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్‌ నిర్మాణం సాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో గల ఖమం జిల్లా, ఏపీలో ఎన్‌టిఆర్‌ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం సాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com