ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదారి జిల్లా అందాల మధ్య .. ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక టూర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 10:14 PM

పర్యాటకులకు, యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినపించింది. దేవాలయాలు, దర్శనీయ స్థలాలను సందర్శించాలనుకునే వారికోసం ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి.. కందుల దుర్గేష్ వెల్లడించారు. అక్టోబర్ 26 నుంచి ఈ ఆధ్యా్త్మిక యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి ఓ ప్రకటనతో తెలిపారు. అయితే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలకు మాత్రమే. వారాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఈ ఒక రోజు టూర్ రూపొందించారు. ఆరు పుణ్యక్షేత్రాల మీదుగా ఈ ఆధ్యాత్మిక యాత్ర సాగనుంది. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించేలా ఈ టూర్ ప్లాన్ చేశారు.


ఇక ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి శనివారం ఈ ఆలయాల మీదుగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 26 నుంచి బస్సులు ప్రారంభమవుతాయి. డిమాండ్‌ను అనుసరించి ఆదివారం కూడా నడిపే ఆలోచన చేస్తున్నారు. ప్రతి శనివారం రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్ వద్ద నుంచి ఉదయం ఆరు గంటలకు బస్సులు ప్రారంభమవుతాయి. తొలుత కోరుకొండలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. అది పూర్తైన తర్వాత పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్తారు.


అటు నుంచి కోనసీమ తిరుపతిగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్దకు చేరుకుంటారు. అక్కడే గోదావరికి జలహారతి కార్యక్రమాన్ని తిలకిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత రాత్రి ఏడున్నరకు రాజమండ్రిలోని ఏపీటీడీసీ కార్యాలయం వద్దకు యాత్రికులు చేరుకుంటారు. ఇక ఈ ఒక రోజు టూర్‌ కోసం చిన్నారులకు రూ.800, పెద్దలకు రూ.1000 చొప్పున టికెట్ రేట్లు నిర్ణయించారు. బస్సులో 18 మంది ప్రయాణించే వీలుంది. యాత్రికులు ఎవరైనా 18 మంది కలిసి పర్యాటక శాఖను సంప్రదిస్తే బస్సును ఏర్పాటు చేస్తారు. చారిత్రక ప్రదేశాలను, ఆధ్యాత్మిక ప్రాంతాలను ప్రకృతి రమణీయత మధ్య ప్రయాణిస్తూ చూడటమే ఈ యాత్ర ఉద్దేశమని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com