కృష్ణాజిల్లా మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్వీనర్ వసంత వసంత కృష్ణప్రసాద్ పై స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసు బూమరాంగ్ అయి తిరగి పోలీసులకే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. సాక్ష్యాలు లేకుండా వసంత కృష్ణప్రసాద్ పై పోలీసు కేసు నమోదు చేశారని ఇద్దరు ఎస్సైలను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపారు. ఈ విషయంపై సీరియస్ అయిన కృష్ణా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జీ.కొండూరు ఎస్సై ఎండి.అప్సక్, మైలవరం ఎస్సై వీ.శ్రీనివాసరావులను వేకెన్సీ రిజర్వ్ పంపారు. ఈనెల 5వ తేదీన వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు మాగంటి రామారావు తమకు లంచం ఇవ్వచూపి ప్రలోభాలకు గురి చేశాడని ఈ ఇద్దరు ఎస్సైలు ఆరోపణలు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు మాగంటి రామారావు, వసంత కృష్ణప్రసాద్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై తప్పుడు కేసులు పెట్టారని మైలవరం పోలీసు స్టేషన్ ముందు వసంత కృష్ణప్రసాద్ తన అనుచరులతో ధర్నాకు దిగారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైలు సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టారని నిర్ధారించుకుని వారిద్దరినీ వీఆర్ కి పంపారు.