ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సజ్జలను ప్రశ్నించిన మంగళగిరి పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 10:18 PM

వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేడు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మంగళగిరి పీఎస్ లో విచారణ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజున తాను అక్కడ లేనని, ఆ రోజున తాను బద్వేలులో ఉన్నానని స్పష్టం చేశారు. ఈ కేసులో 120వ నిందితుడిగా తన పేరు చేర్చారని, ఘటన జరిగిన సమయంలో తాను వైసీపీ కార్యాలయంలో ఉన్నట్టు స్టేట్ మెంట్ లో పేర్కొన్నారని, ఇది ఎలా సాధ్యం... అని సజ్జల ప్రశ్నించారు. ఏదో చేయాలని నేను అప్పిరెడ్డితో చెప్పానంట... ఇది కథ కాక మరేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ శ్రేణులు భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, స్వేచ్ఛగా తిరగనివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టులో కూడా అడ్డుకుంటున్నారని అన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలంతో ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేయడం ఏంటని సజ్జల నిలదీశారు. ఈ కేసును సాగదీసేందుకే సీఐడీకి అప్పగించారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కేసులతో తమను దెబ్బతీయలేరని, ఇటువంటి కేసులు తమలో మరింత ధైర్యాన్ని పెంచుతాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com