షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ సారథ్యం వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి... పరోక్షంగా పాక్కు చురకలు అంటించారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం ఉండదని మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య సహకారానికి పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ప్రాతిపదికగా ఉండాలని తెలిపారు. అందుకు నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగితేనే ఎస్సీఓ సభ్య దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి జైశంకర్ చెప్పారు.