తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలపై దాడుల ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంపై దాడి ఘటన మరువకముందే.. ఆంధ్రప్రదేశ్లో ఓ ఆలయంపై దాడి జరిగింది. అన్నమయ్య జిల్లాలోని అభయాంజనేయస్వామి ఆలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఆలయం గ్రామానికి కాస్త దూరంగా ఉంటుంది. అయితే రాత్రి పూట కొంతమంది దుండగులు ఆలయంపై దాడి చేశారు. గేట్లు ధ్వంసం చేసి..ఆలయాన్ని పునాదులతో సహా పెకిలించే ప్రయత్నం చేశారు.
అయితే ఉదయమే అటుగా వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆలయంపై దాడి వ్యవహారం తెలియడంతో హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు ఆంజనేయస్వామి ఆలయంపై దాడి వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి.. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. వీలైనంత త్వరగా దాడి చేసినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
మరోవైపు సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంపై దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని పవన్ కళ్యాణ్ అన్నారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందన్న పవన్ కళ్యాణ్.. ఇది మహాపచారం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో ఆలయాలపై ఇలాంటి దాడులు జరిగాయన్న పవన్.. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లోనూ హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇలాంటి దుర్మార్గాలపై బలమైన చర్యలు అవసరమని.. ఆందుకే తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.