ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత విద్యుత్‌పై ట్రంప్ హామీ.. అరవింద్ కేజ్రీవాల్ రియాక్షన్ వైరల్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 08:24 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో మూడు వారాలే ఉండగా.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. ట్రంప్ హామీపై ఆప్‌ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ స్పందించారు. ఎక్స్‌ (ట్విట్టర్)లో ఆయన చేసిన పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ బీజేపీపై పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్‌ బిల్లులు సగానికి తగ్గిస్తా... దేశ విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం.. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది.. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని ట్రంప్‌ హామీ ఇచ్చారు.


దీనికి సంబంధించిన వీడియోను ట్రంప్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ‘విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ వాగ్దానం ఇచ్చారు.. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లాయి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఎన్డీయే అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లోనూ ఉచిత విద్యుత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అమలుచేస్తే త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా విఫలమయ్యాయని కేజ్రీవాల్ విమర్శించారు.


‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలుంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని దేశంలోని ప్రజలకు బాగానే అర్దమైంది’ అని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆప్‌ ప్రభుత్వం అందిస్తోన్న ఉచితాలు నిలిపివేస్తుందని ఆయన విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీ ఉచిత కరెంటు పథకాన్ని ఆప్ సర్కారు అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో పలు పార్టీలు ఈ తరహా హామీలు ఇవ్వడంతో గెలుపును ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఉచితాలు ప్రకటిస్తున్నారని బీజేపీ పలుమార్లు ఎదురుడాది చేసింది. అయితే, పేదల సంక్షేమం కోసమే తాను వాటిని అమలు చేస్తున్నానంటూ కేజ్రీవాల్‌ సమర్థించుకున్న విషయం తెలిసిందే.


కాగా, అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌ను బీజేపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘అరవింద్ కేజ్రీవాల్‌కు పాలన, ఉచితాల గురించి ఎంత జ్ఞానం ఉందో స్పష్టంగా ఇది చూపిస్తుంది. ఈ ఉచితాలు ఎలా ఉన్నాయి? అతడు (ట్రంప్) ఇంధన సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం గురించి మాట్లాడుతున్నారు.. ఉచిత విద్యుత్ గురించి కాదు’ అని ఒకరు.. తగ్గించడం అంటే ఉచితమా? ఆయన వాగ్దానాలను నెరవేర్చడానికి మోదీ నుంచి మీలాగా డబ్బు డిమాండ్ చేయడు’ మరొకరు ఇలా విమర్శలు గుప్పించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com