ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ప్రభుత్వ నిర్ణయంతో జేబుకు భారమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 06:29 PM

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటల వరకూ ఎక్సైజ్ శాఖ అధికారులు సమయం ఇచ్చారు. అప్పటి వరకూ క్యూలైన్లలో ఉన్నవారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. అయితే నూతన మద్యం విధానంలో ఏపీ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం మందుబాబులకు షాక్ ఇచ్చేలా ఉంది. మద్యం ధరలకు సంబంధించి రౌండప్ పెంపు నిర్ణయం మందుబాబులకు కాస్త భారంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధానం కారణంగా మద్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం ప్రకారం ఏపీలో మద్యం ధరలు ఉండనున్నాయి. అయితే నూతన మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.


ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మద్యం బాటిళ్ల ధరలు పెరగనున్నాయి. ఈ విధానం ప్రకారం మద్యం బాటిళ్ల ధర 150, 200 రూపాయలుగా ఉంటే.. వాటిని అదే ధరకు విక్రయిస్తారు. అలాకాకుండా మద్యం బాటిళ్ల ధరలు కాస్త అటూ ఇటూగా ఉంటే.. అంటే 151, 202.. ఇలా అర్ధరూపాయి అటూ ఇటుగా ఉన్నా సరే వాటిని రౌండాప్ చేస్తారు. ఈ లెక్కన మద్యం బాటిళ్ల ధర రూ.150 కంటే అర్ధ రూపాయి ఎక్కువగా ఉన్నా సరే.. రూ.160 వసూలు చేస్తారు. అలాగే 200 కంటే 50 పైసలు ఎక్కువగా ఉన్నా సరే రూ.210 వసూలు చేస్తారు. ఇదే సమయంలో క్వార్టర్ బాటిల్ రూ.99 కే అందిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాటిల్ సీసా రూ. 90.50 పైసలు ఉన్నా కూడా రూ.99 కే విక్రయిస్తారు. ఈ రౌండాప్ పెంపు కారణంగా మందుబాబులకు భారం పడే అవకాశం ఉంది.


మరోవైపు లిక్కర్ షాపుల కోసం దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా.. దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి ఏడు వరకూ క్యూలైన్లలో ఉన్న వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తారు. ఒకవేళ ఏడు గంటల లోపల ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం ఉంది. అయితే బ్యాంకు డీడీలతో ఎక్సైజ్‌ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారికి మాత్రం ఏడు గంటల వరకే ఛాన్సుంది.


ఇక గురువారం రాత్రి వరకూ 3,396 మద్యం దుకాణాలకు 65,424 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,308 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. 14న కలెక్టర్ల పర్యవేక్షణలో లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం లాటరీ తీసి.. అదే రోజు కేటాయింపు పూర్తి చేస్తారు. అక్టోబరు 16 నుం నూతన మద్యం విధానం ప్రకారం ప్రైవేట్ మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com