ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 రోజులు వేతనంతో కూడిన సెలవులు.. ఉద్యోగులకు 'మీషో' ఆఫర్

business |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 09:59 PM

ఏ రంగంలో పని చేస్తున్న వారైనా మానసిక, శారీరక ఆరోగ్యానికి కొంత విశ్రాంతి అవసరం. పని ఒత్తిడి నుంచి తమ ఉద్యోగులకు విశ్రాంతి ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో. తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తమ కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది ఈ సెలవుల్లో పూర్తి విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మీషో సంస్థ ఓ ప్రకటన చేసింది. వరుసగా నాలుగో సంవత్సరం ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొంది.


'ఈ 9 రోజుల పాటు ల్యాప్ టాప్స్ ఉండవు. ఇ-మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ రావు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. వరుసగా నాలుగో ఏడాది రెస్ట్ అండ్ రీఛార్జ్ బ్రేక్ అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాం. ఈ ఏడాది మెగా బ్లాగ్‌బాస్టర్ సేల్ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకొన, మపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకు ఈ రెస్ట్ అండ్ రీఛార్జ్ బ్రేక్' అని సోషల్ మీడియా వేదికగా మీషో సంస్థ వెల్లడించింది.


ఉద్యోగుల కోసం 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన పోస్టును చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు సంస్థ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఈ విధానం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రాసుకొచ్చారు. తమ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారు అనేది ఈ నిర్ణయాన్ని బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు. పని ఒత్తిడి భారం నుంచి ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన చాలా గొప్పదని, మీషోపై చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇతర రంగాల్లోని సంస్థల్లోనూ ఇలాంటి నిర్ణయాలు ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com