ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు మోదీ దసరా కానుక.. ఆ పథకం మరో నాలుగేళ్ల పొడిగింపు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 09:57 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచిత బియ్యం/ ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మరో నాలుగేళ్ల పొడిగించాలని నిర్ణయించింది. ఉచిత బియ్యం పథకం డిసెంబరు 2028 వరకు అమలు చేయనున్నారు. దేశంలో పోషకాహార లోపాన్ని నివారించడంలో భాగంగా పీఎంజేకేఏవైతో పాటు సంబంధిత పథకాలను పొడిగించింది. వీటి కోసం రూ. 17,082 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.


రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 80 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ఈ పథకం ద్వారా రక్తహీనత, సూక్ష్మ పోషకాహారలోపాన్ని నిరోధించడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది. ‘ఏడాదికి ఒక్కొక్కటి 111 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 925 ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తి కేంద్రాలు, 223 మెట్రిక్ టన్సుల సామర్థ్యం కలిగిన 21,000 రైస్ మిల్లులను ఏర్పాటుచేశాం.. వీటితో పాటు 75 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 232 ప్రీమీక్స్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.. ఈ బియ్యం టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా 52 ల్యాబ్‌లు.. ఎఫ్ఆర్కే టెస్టింగ్ కోసం మరో 27 ల్యాబ్‌లు, విటమిన్లు, ఖనిజ లవణాల టెస్టింగ్ కోసం అదనంగా 11 ల్యాబ్‌లు నెలకొల్పాం.. సప్లయ్ ఛైన్ అభివృద్ధి కోసం రూ.11,000 కోట్లు ఖర్చు చేశాం’ కేంద్రం పేర్కొంది.


పీఎంజీకేఏవైతోపాటు లోథాల్‌లో ‘నేషనల్‌ మారిటైమ్‌ హెరిటేజ్‌ కాంప్లెక్స్‌’ అభివృద్ధికి క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ మొదటి దశ కోసం రూ.1,238.05 కోట్లు ఖర్చుచేయనున్నారు. దేశంలో కీలక నౌకాశ్రయాలు, కేంద్ర రక్షణ, సాంస్కృతిక శాఖల సహకారంతో ఇది పూర్తిచేస్తారు. అలాగే, రెండు, మూడో దశకు ప్రాథమిక అనుమతి ఇచ్చిన క్యాబినెట్.. ఇందుకు స్వచ్ఛంధ మార్గాల ద్వారా నిధులు సమకూర్చనుంది.


ఫేజ్ 1బీలో రూ.266.11 కోట్లతో లైట్‌హౌస్ మ్యూజియం నిర్మిస్తారు. ఇందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్‌హౌసెస్ అంట్ లైట్‌షిప్స్ ఆర్దిక సాయం అందజేయనుంది. ఈ ఎన్ఎంహెచ్ సీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా స్థానికులు, పర్యాటకులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, వాతావరణ, వ్యాపార విభాగాలకు ప్రయోజనం కలుగుతుంది.


అలాగే, రాజస్థాన్‌, పంజాబ్‌ సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా రూ.4,406 కోట్లతో 2,280 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి ఆమోదం వేసింది. ఈ ప్రాజెక్ట్ సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని పెంచడం, ప్రయాణాన్ని మెరుగుపరచడం, జాతీయ రహదారి నెట్‌వర్క్‌తో మెరుగైన కనెక్టివిటీని నిర్ధారించడం వంటి వాటిపై ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com