ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. మంగళగిరిపై సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో అధినేత వైఎస్ జగన్ స్ట్రాటజీ మార్చారు.. పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లాలవారీగా అధ్యక్షుల నియమాకాలు చేపట్టారు. అలాగే అవసరమైన చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను సైతం మార్చారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.


మంగళగిరి నియోజకవర్గం నేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం జరుగుతోందని.. వారికి కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలన్నారు. అందుకే నియోజకవర్గంలో అన్నిటిని తట్టుకుని కార్యకర్తలకు అండగా ఉండే వేమారెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించామన్నారు. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు.


రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశామన్నారు జగన్. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. గతంలో కూడా మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేశామన్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌తో పాటు సంక్షేమ కేలండర్ కూడా విడుదల చేసే వాళ్లం.. ప్రతినెలలో బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. కష్టాలు ఎక్కువ కాలం ఉండవని.. మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు.


రెడ్ బుక్ అని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని.. తాను వద్దని చెప్పినా తమ వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారన్నారు జగన్. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాము గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టామని.. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం.. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయన్నారు. ప్రజల ఆశీస్సులతో ముందడుగు వేశామని.. కష్టాలు ఎక్కువ కాలం ఉండవన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు. కష్టాల నుంచే నాయకులు బయటకు వస్తారన్నారు.


మంగళగిరి నియోజకవర్గంలో కాస్త ఆసక్తికర పరిణామాలు జరిగాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని 2024 ఎన్నికల్లో పక్కన పెట్టారు. ముందు మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని ఇంఛార్జ్‌గా ప్రకటించారు.. టికెట్ కూడా ఖాయమని చెప్పారు. ఆ తర్వాత మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయించగా.. ఆమె లోకేష్‌ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా లావణ్య స్థానంలో వేమారెడ్డిని ఇంఛార్జ్ఋగా నియమిస్తున్నట్లు జగన్‌ పార్టీ నేతల సమక్షంలో ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com