ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైకు చంద్రబాబు, నారా లోకేష్.. కేబినెట్ సమావేశం వాయిదా వేసి మరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:21 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబైకు వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా చంద్రబాబు వెంట ముంబై వెళుతున్నారు. అలాగే ఏపీ కేబినెట్ భేటీలో రతన్‌ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అజెండాను వాయిదా వేయనున్నారు.. సంతాపం తర్వాత కేబినెట్ సమావేశం ముగిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్‌ ముంబైకి వెళతారు. ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో రతన్‌ టాటా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


 రతన్ టాటా మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపాన్ని తెలిపారు. కొందరు మాత్రమే వెళుతూ వెళుతూ ఈ భూమిపై తమ అడుగుజాడలు వదిలి వెళతారని.. తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారన్నారు. రతన్ టాటా వంటి ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ, జాతి నిర్మాణంలో తరతారాలలో మార్పును తెచ్చిందని ప్రశంసించారు. ఆయన గొప్ప వారసత్వాన్ని అందరికి వదిలి వెళ్ళారన్నారు.


విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపారాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అన్నారు మంత్రి లోకేష్. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా నిబద్ధతతో టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిర్వహించారన్నారు. దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని అన్నారు. నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారన్నారు.


మరోవైపు రతన్ టాటా మరణంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు. రతన్‌ టాటా సేవలను ప్రశంసిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ట్వీట్ చేశారు. 'ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. ఆయన. కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను' అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com