ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. రెండు ఘాట్ రోడ్లలో ఆంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 06:50 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడ వాహన సేవ సందర్భంగా ముందురోజు నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇవాళ (అక్టోబర్ 7) రాత్రి 9 గంటల నుంచి.. ఈనెల 9న ఉదయం వరకు ఘాట్ రోడ్డులో బైక్‌లు, ఎల్లో బోర్డు (ట్యాక్సీ) వాహనాలు నిషేధించినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు.. 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12వ తేదీ వరకు ట్యాక్సీలు, వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు. వీరు తిరుమలలో జీఎన్‌సీ సర్కిల్‌ నుంచి వెళ్లి పీఏసీ-111 కూడలిలో యాత్రికులను దించి తిరుపతి వెళ్లాలని సూచించారు. తిరుమల లోపలకు అనుమతించరు..ఈ నెల 8న గరుడసేవ ఉండటంతో ఇవాళ (అక్టోబర్ 7) మధ్యాహ్నం 2 నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు తిరుమలకు ట్యాక్సీలకు అనుమతి ఉండదు.


ఈ నెల 8న (మంగళవారం) తిరుమల బ్రహ్మోత్సవాలలో కీలకమైన గరుడసేవ రోజు.. కొండపై ఎనిమిదివేల వాహనాల పార్కింగ్‌ సామర్థ్యం ఉంది. ఈ 8వేల వాహనాల సామర్థ్యం పూర్తయ్యాక సొంత వాహనాలను కొండపైకి అనుమతించరు.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తిరుపతిలో పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించి అధికారులు సూచనలు చేశారు. కడప, శ్రీకాళహస్తి నుంచి వచ్చే వాహనాలను కరకంబాడి సమీపంలోని ఎస్వీఎస్ ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఆపాల్సి ఉంటుంది. పుత్తూరు మార్గం వైపు నుంచి వచ్చే భక్తులు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


చిత్తూరు, పీలేరు వైపు నుంచి వచ్చే వాహనాలు దేవ్‌లోక్, భారతీయ విద్యాభవన్‌ గ్రౌండ్‌లో వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. బైక్‌లను ఇస్కాన్, నెహ్రూ మున్సిపల్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలన్నారు. అలాగే సింధు, తనపల్లి, ఆర్‌సీపురం, నంది కూడళ్ల దగ్గర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి పార్కింగ్‌ కేంద్రం దగ్గర భక్తులు తిరుమలకు వెళ్లడానికి వీలుగా ఆర్టీసీ బస్సుల్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి, పోలీసులకు సహకరించాలని కోరారు. గరుడ సేవ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.


మరోవైపు పోలీసులు, టీటీడీ భద్రతా, నిఘా విభాగం గరుడ సేవ రోజు భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. టీటీడీ భద్రత, నిఘా విభాగం నుంచి 1,250 మంది.. పోలీసు శాఖ నుంచి 3 వేల 900 మంది సిబ్బందిని నియమించారు. అంతేకాదు తిరుమలలో గరుడ సేవకు అదనంగా 1,200 మందితో భద్రత కల్పిస్తున్నారు. తిరుమలలో గరుడ సేవ రోజు చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.. టోల్‌ ఫ్రీ నంబరు 155257కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. తిరుమల శ్రీవారి భక్తులు తమ సూచనలు, సలహాలు టీటీడీ మెయిల్ helpdesk.ttd@tirumala.orgకు తెలియజేయొచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com