ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 04:05 PM

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు  కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ముస్లింలను ఏమారుస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని చెప్పారు.''ఎన్నికల టైంలో 15 శాతం ఓట్లు కచ్చితంగా తమకే అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. ఇది ఆ పార్టీ ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది. ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా చూస్తుందన్న విషయం అందరికీ తెలుసు. ఇది ముస్లింలకు భారీ నష్టం చేస్తోంది'' అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాజాగా ఆ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్న మంత్రి రిజిజు.. హిందూ ముస్లింలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ''ముస్లింలకు నేను చేసే హెచ్చరిక ఏంటంటే.. మీరు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా మారకండి. ఇక హిందువులు, ఇతరులకు హెచ్చరిక ఏంటంటే.. మీరు కాంగ్రెస్ అనుసరిస్తున్న విభజించి పాలించే విధానానికి బాధితులుగా మిగలొద్దు'' అని వ్యాఖ్యానించారు.


ముస్లింలు ఎప్పటికీ తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ భావిస్తుంటుందని మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఇలాంటి ఆలోచనా తీరుతో ముస్లిం సామాజిక వర్గం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఒకప్పుడు బీఆర్ అంబేడ్కర్ న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసిన తరువాత కూడా కాంగ్రెస్ ఆయనను అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు. హిందువుల్లో చీలికలు తెస్తూ ముస్లింలను ఎప్పటికీ తమ ఓటు బ్యాంకుగా నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేశారు.


'ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొనే సమస్యల గురించి రాహుల్‌కు ఏమీ తెలీదు. అయినా, ఆయన నిత్యం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గురించి మాట్లాడుతుంటారు. అలాగే మాట్లాడాలని ఆయనకు తర్ఫీదునిచ్చారు'' అని అన్నారు.


ఇటీవల మంత్రి మరో సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ గత 60 ఏళ్లుగా ముస్లింలను పేదవారిగా మార్చేసిందని అన్నారు. ''నేను ముస్లింలను ఒకటే అడగ దలుచుకున్నా.. ఈ 60 ఏళ్లల్లో మిమ్మల్ని పేదలుగా మార్చింది ఎవరు? కాంగ్రెస్సే... నేడు ప్రధాని మోదీ మీకు బ్యాంక్ అకౌంట్లు తెరుస్తున్నారు. ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. నీరు, విద్యుత్, లోన్లు వంటివన్నీ అందజేస్తున్నారు. భారతీయులందరినీ ఆయన సమదృష్టితో చూస్తారు. ప్రయోజనాలన్నీ అందరికీ చేరాలని కోరుకుంటారు. మరి ముస్లింలు అందరూ కాంగ్రెస్‌కే ఓటు ఎందుకు వేయాలి? ఒక వర్గాన్ని ఇలా దుర్వినియోగపరచడం చాలా తప్పు. నేను కాంగ్రెస్‌కు చేసే హెచ్చరిక ఒకటే.. ముస్లింలను మీరు ఓటు బ్యాంకుగా మార్చొద్దు. ఈసారి వారు కాంగ్రెస్‌కు ఓటు వేయకుండా ప్రయత్తిస్నాం. స్పష్టమైన సందేశంతో ప్రజలు ముందుకు వెళతాం'' అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com