ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బావ కళ్లల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్లల్లో సంతోషం చూడండి పురందేశ్వరి గారూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 07:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే.. ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అనడం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురందేశ్వరి.. బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడూ హిందూయిజం గురించి మాట్లాడని పవన్.. ప్రస్తుతం వేస్తున్న వేషాలను జనం గమనిస్తున్నారని రోజా అన్నారు.


"పురందేశ్వరి గారు.. బావ కళ్లల్లో ఆనందం కంటే భక్తుల కళ్లల్లో ఆనందం చూడ్డానికి ప్రయత్నించండి. సుప్రీంకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ప్రభుత్వ తరుఫు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకే ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు అడిగింది. అయితే ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడవచ్చంటూ మీరు మాట్లాడటం సిగ్గుచేటు. మీరు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలు.. కోర్టులో ఎందుకు చెప్పలేకపోయారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు తిరుమల లడ్డూ మీద నిందలు వేసినప్పుడు.. సుప్రీంకోర్టు అడగటంలో తప్పేముంది. మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా.. టీడీపీ అధ్యక్షురాలా.. బావ కళ్లల్లో ఆనందం కోసం.. ఆయన చేసే తప్పులు వెనకేసుకుని రాకండి. చంద్రబాబు ప్రకటనను సరిదిద్దాల్సిన బాధ్యత మీకుంది. నిజానిజాలు తేల్చి.. తప్పుచేసిన వారిని శిక్షించాలి. లేదంటే తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని తిరుపతి అమ్మాయిగా డిమాండ్ చేస్తున్నా" అని రోజా అన్నారు.


ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలపైనా రోజా సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు ఏనాడూ కూడా హిందుత్వం గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వేస్తున్న వేషాలను జనం గమనిస్తున్నారని అన్నారు. రోజుకో వేషం వేయడానికి ఇది సినిమా షూటింగ్ కాదంటూ ఎద్దేవా చేశారు.


"పవన్ కళ్యాణ్.. ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకో వేషం వేసుకుని, రోజుకో మాట మాట్లాడుతూ అందరి మనోభావాలు దెబ్బతీయడానికి మీకేం అధికారం ఉంది. మీరు చేసిన తప్పులకు భగవంతుడు మీతో ప్రాయశ్చిత్త దీక్ష చేయించారు. భగవంతుడే లేరని గతంలో మీరు, మీ కుటుంబసభ్యులు చెప్పారు. గతంలో ఏ రోజూ హిందూయిజం గురించి మాట్లాడని మీరు.. ఈ రోజు వేస్తున్న వేషాలను, మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారు. టీటీడీ ఈవోకు తిరుమలలో జరిగే ప్రతి దానితో సంబంధం ఉంటుంది. రెండు నెలలకు మాట మార్చిన టీటీడీ ఈవోపై చర్యలు తీసుకోవాలి. నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి. పర్చేజింగ్ కమిటీ సభ్యులను కూడా విచారించాలి" అని రోజా డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com