ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుంగనూరులో ఆరేళ్ల బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతం.. శవమై తేలిన చిన్నారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 07:02 PM

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. చెరువులో శవమై తేలింది. వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరుకు చెందిన ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో కరెంట్ పోయింది. బాలిక తల్లి బయటకు వచ్చి చూస్తే కుమార్తె కనిపించలేదు. వెంటనే ఆమె ఫోన్‌ ద్వారా విషయాన్ని భర్తకు తెలియజేసింది. పాప కోసం కుటుంబసభ్యులు రాత్రి పది గంటల 30 నిమిషాల వరకూ వివిధ చోట్ల గాలించారు. ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.


అయితే ఎక్కడా బాలిక ఆచూకీ తెలియకపోవటంతో.. గాలింపు చర్యలు వేగవంతం చేశారు. మొత్తం 11 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలిక కోసం గాలించారు. ఈ క్రమంలోనే పలువురు అనుమానితులు కూడా పోలీసులు ప్రశ్నించారు. డాగ్ స్వ్కాడ్‌లను సైతం రంగంలోకి దించారు. అయితే ఎక్కడా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లిన పోలీసులు.. మరోసారి కుటుంబీకులను విచారించారు. ఇక ఎస్పీ సైతం దర్యాప్తును పర్యవేక్షించారు. క్లూస్ టీమ్ ఇచ్చిన సమాచారాన్ని సైతం సమీక్షించారు. బాలిక ఆచూకీ కోసం అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. అయితే బుధవారం ఉదయం విషాదకర వార్త వెలుగుచూసింది.


సమ్మర్ స్టోరేజ్‌లో ఓ చిన్నారి శవాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం కనిపించకుండా పోయిన చిన్నారిదేనని అనుమానించారు. దీంతో పాప కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలికి చేరుకున్న బాలిక తండ్రి.. మృతదేహం తమ కుమార్తెదేనని ధ్రువీకరించారు. చనిపోయింది తమ కూతురేనని తెలిసి బాలిక కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కనిపించకుండా పోయిన బాలిక తిరిగొస్తుందనే ఆశతో ఇన్ని రోజులు ఉన్న కుటుంబం.. తమ కూతురు ఇక లేదనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది.


మరోవైపు చిన్నారి మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరైనా హత్యచేసి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారా లేదా.. ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. చిన్నారి తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావటంతో ఎవరైనా డబ్బులు కోసం కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com