ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో బంగారు రథం ట్రయల్ రన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 08:52 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి.. స్వామివారి బంగారు రథం, మహారథానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. భక్తులు, ఉద్యోగులు రథాన్ని కొంతదూరం లాగగా.. ఇంజినీరింగ్, టీటీడీ అధికారులు పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రథాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి ఏటా ఇలా ట్రయల్ రన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాల తుది సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున, తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.


టీటీడీలోని అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు ఈవో. అన్నప్రసాదం, ఆరోగ్య (పారిశుద్ధ్యం) విభాగాలు రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని సూచించారు.


అనంతరం ఇంజినీరింగ్‌ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, గార్డెన్‌, ఫారెస్ట్‌లు, నృత్యం, భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్‌ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.


శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు


తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 29న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 4న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 5న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబరు 6న శ్రీ మ‌హాలక్ష్మీ అమ్మ‌వారు, అక్టోబరు 7న మావడి సేవ, అక్టోబరు 8న శ్రీ‌అన్నపూర్ణాదేవి, అక్టోబరు 9న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 10న శ్రీ మహిషాసురమర్థిని, అక్టోబరు 11న శ్రీ‌ సరస్వతి దేవి, అక్టోబరు 12న శ్రీ శివ‌పార్వ‌తుల‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 12న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంట‌ల‌కు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com