రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువత అభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. శుక్రవారం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కింద రూ. 2వేలు ఇవ్వడం ఒక ఎత్తని, అలాగే వారికి స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమని, వారి కోసం నిరంతరం ఎంతయిన ఖర్చు పెట్టి వారిని డెవలప్ చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. యువతే రాష్ట్రానికి పెద్ద శక్తి అని, ఆ శక్తిని రాష్ట్రానికే కాకుండా ప్రపంచానికి సేవలు అందించడానికి ఉపయోగించాలన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించామని చంద్రబాబు అన్నారు. 2022 నాటికి అండర్ గ్రౌండ్ డ్రయినేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్పోర్ట్ కాంప్లెక్స్లు, ప్లే గ్రౌండ్స్ రెండు, మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మహిళలకు డబ్బులిచ్చామని, ఇంకా అవసరమైతే ఎప్పటికప్పుడు వడ్డీలేని రుణాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.