ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్,,,,నవంబర్ 14న సమావేశం నిర్వహణకు ముహూర్తం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 07:09 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ బడుల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం సరికొత్త ఆలోచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 14న మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ భాగస్వాములవుతారని లోకేష్ అన్నారు. మంత్రి పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించలేకపోయామని.. నవంబరు 11న జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు అక్టోబరు 3 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులలో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఇటీవల తాను ఉత్తరాంధ్రతో పాటూ చిత్తూరు జిల్లాలోని స్కూళ్లలో తనిఖీ చేసిన విషయాలను ప్రస్తావించారు. తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం పురపాలక ప్రాథమిక పాఠశాల, ఆకనంబట్టు ఉన్నత పాఠశాల పనితీరు బావుందని ప్రశంసించారు. ఆ రెండు స్కూల్స్‌లో విద్యార్థుల చేతిరాత, ప్రతిభ అద్భుతమని.. రూ.50 వేలతో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగు చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వం నాడు-నేడు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారని ప్రశ్నించారు లోకేష్.


అలాగే రాజధాని అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచస్థాయి కేంద్రీయ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలకు కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయాన్ని వ్యక్తి చేశారు. అందుకే గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.


రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలతోపాటు ప్రమోషన్లకు ప్రత్యేకంగా చట్టం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీని కోసం పలు రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేయనున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటించి, అర్హతల ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టనుంది ప్రభుత్వం. పదోన్నత్తుల విషయంలో కొన్ని మార్పులు తేవాలని.. ఇది అమల్లోకి వస్తే పదోన్నతుల్లో పారదర్శకతకు అవకాశం ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం. టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించే పనిలో ఉంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఉపాధ్యాయుడు సర్వీసు ఆధారంగా ఒక్కో జోన్ మారతారు..‌తన సర్వీసు కాలంలో అన్ని జోన్‌లలోనూ పనిచేస్తారు. ఈ చట్టం అమల్లోకి వస్తే రాజకీయ సిఫార్సు బదిలీలు, డబ్బులు తీసుకొని చేసే అక్రమ బదిలీలకు అవకాశం ఉండదంటున్నారు. మొత్తానికి మంత్రి లోకేష్ విద్యాశాఖలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com