ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడ్డూ పెట్టిన మంట.. టీ-బీజేపీ వర్సెస్ వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 06:06 PM

ఏపీలో మొదలైన తిరుపతి లడ్డూ వ్యవహారం క్రమంగా పక్క రాష్ట్రానికి కూడా పాకుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా ఉన్న వ్యవహారం క్రమంగా తెలంగాణ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల అపవిత్రమైందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావు ఇప్పటికే ఈ విషయంలో జగన్ మీద విమర్శలు చేయగా.. తాజాగా మాధవీలత ఇటీవల తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. రైళ్లో భజన చేసుకుంటూ మాధవీలత తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలోనే మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్ జగన్ సర్కారు ప్రవర్తించిందని మండిపడ్డారు. తిరుమలలో కల్తీ నెయ్యి బయటపడితే ప్రాయశ్చిత్తం ఎందుకు చేయలేదని ప్రశ్నించిన మాధవీలత.. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తే తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే జగన్‌ను తిరుమలకు వెళ్లనివ్వకూడదని.. కొండ కిందే ఆపేయాలంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఈ క్రమంలోనే మాధవీలత వ్యాఖ్యలకు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మాధవీలత పక్క రాష్ట్రం నుంచి భజన చేసుకుంటూ తిరుమలకి వచ్చారని.. అది దిక్కుమాలిన తనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భజన చేయాలనుకుంటే తన ఆస్పత్రిలో చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. మాధవీలత ఆస్పత్రిలో ఒక్క రోగికైనా ఫీజు తగ్గించారా అంటూ మాధవీలతపై విమర్శనాస్త్రాలు సంధించారు. మాధవీలతకు ఆంధ్రప్రదేశ్‌కు ఏం సంబంధం ఉందన్న పేర్ని నాని.. ఇక్కడి హిందువులు, మతం గురించి ఆమె మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు వెళ్తే.. ఆయనను డిక్లరేషన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ రోజు మాట్లాడుతున్న నేతల నోరు.. ఆ రోజు ఏమైందంటూ పేర్ని నాని ఘాటుగా రియాక్టయ్యారు.


మరోవైపు చంద్రబాబు అబద్ధాలు చెప్తూ తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ నేతలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పేర్ని నాని సైతం మచిలీపట్నంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. బచ్చుపేటలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పేర్ని నాని.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశారన్న పేర్ని నాని.. ఇప్పుడు మాత్రం కల్తీ నెయ్యి ఎందులో వాడారో తెలీదంటున్నారని మండిపడ్డారు. కేవలం వైఎస్ జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారని విమర్శించారు. వైఎస్ జగన్ తిరుమలకు వస్తున్నారని తెలియగానే కొండపై డిక్లరేషన్ ఫ్లెక్సీలు పెట్టించారని.. జగన్ పర్యటన వాయిదా పడిందని తెలియగానే ఫ్లెక్సీలు తీయించారని ఆరోపించారు. క్రిస్మస్ రోజున చర్చికి, రంజాన్ రోజును మసీదులో ప్రార్థన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా అంటూ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com