ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్! ఎవరాపుతారో చూస్తామన్న మాజీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 05:59 PM

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం పొలిటికల్ హీట్ పెంచుతోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వెళ్తానని ప్రకటించడంతో ఈ హీట్ మరింత పెరిగింది. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే వైఎస్ జగన్ మరోసారి తిరుమలకు వెళ్తారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన అబద్ధపు ప్రచారంతో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారంటూ వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తోంది. ఆలయాలను దర్శించుకుంటున్న వైసీపీ నేతలు.. దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రిషికొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్.. వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.


వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లాలనుకుంటే ఆయనపై లేనిపోని ఆరోపణలు చేశారు. ఆయన వెనుక వెళ్తామన్నవారికి నోటీసులు ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే భారతదేశంలో.. ఓ మాజీ ముఖ్యమంత్రిని దేవుడి దర్శనానికి వెళ్లనీయరా.. డిక్లరేషన్ ఇవ్వాలని అడ్డుకుంటారా.. జగన్ తిరుమలకు వెళ్లడం ఇప్పుడు వాయిదా పడొచ్చేమో కానీ.. మళ్లీ వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఎవరు ఆపుతారో చూస్తాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇబ్బందులు సృష్టిస్తారనే కారణంతో వైఎస్ జగన్ ఓ అడుగు వెనక్కి వేశారమో తప్ప.. ఆయనకు భక్తిని నిరూపించుకోవాల్సిన పనిలేదు." అని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.


"ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలతో, తిరుమల శ్రీవారి ప్రసాదంతో టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. గతంలో నెయ్యిని మైసూరులో టెస్టులు చేయించేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా గుజరాత్‌కు పంపించారు. ఆ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవో చెప్తారు. లేదు వాడామని సీఎం చెప్తారు. కేవలం రాజకీయం కోసం, విజయవాడ వరదలను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పక్కదారి పట్టించడం కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలను చేసిన వారు నిరూపించాలి. అందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. సిట్ ఎంక్వైరీ సీఎం చేతిలో ఉంది. అందుకే మాకు సిట్ విచారణ మీద నమ్మకం లేదు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. అబద్ధపు ఆరోపణలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ని కోరుకున్నాం." అని అమర్‌‍నాథ్ డిమాండ్ చేశారు.


ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షపైనా గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం కాకుండా.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఓ డాక్టర్‌ను తిట్టినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని అన్నారు. తప్పులు, పాపాలు చేసినవారే ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలన్న అమర్‌నాథ్.. ఏం దీక్షలు ఏం చేసినా కూటమి పార్టీలే చేయాలి కానీ తమకు అవసరం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com