ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీగలు కాదు.. డొంకలు కదలాలి.. తిమింగళాన్ని పట్టాలి.. చంద్రబాబుకు షర్మిల సలహా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 05:54 PM

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీలో హాట్‌టాపిక్‌గా ఉన్న అంశాలపై స్పందిస్తూ, ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సంభవించిన వరదల సమయంలో, తిరుమల లడ్డూ వివాదం సమయంలో.. కాంగ్రెస్ పార్టీ తరుఫున తమ వైఖరి ఏంటో తెలియజేశారు. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తైన సందర్భంగా.. హామీల అమలు సంగతి ఏమైందంటూ నిలదీశారు. తాజాగా గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్టుపై వైఎస్ షర్మిల స్పందించారు. వెంకటరెడ్డి లాంటి తీగలను మాత్రమే కాదు.. ఆ వెనుక ఉన్న పెద్ద డొంకలు కూడా కదలాలి.. అ రకంగా దర్యాప్తు జరపాలంటూ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.


"వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా.. విచారణ జరపాలి. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే.. తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు." అంటూ షర్మిల ఆరోపించారు.


నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధలను తుంగలో తొక్కి.. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణం మీద ఏసీబీ విచారణ చేయించాలని.. సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని.. కూటమి సర్కార్‌ను డిమాండ్ చేశారు. సహజ వనరుల దోపిడీపై సీబీఐ విచారణను కోరాలని సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు.


మరోవైపు వైసీపీ హయాంలో గనులశాఖకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ గనులశాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు రాగా.. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన పరారీలో ఉన్నారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. చివరకు హైదరాబాద్‌లో అతనిని అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ తీసుకువచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వెంకటరెడ్డికి అక్టోబరు 10 వరకూ రిమాండు విధించగా.. విజయవాడ జైలుకు తరలించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com