ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక సాయం.. ఇక రైతులకు నో టెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 07:37 PM

ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సాయం అందించింది. కుంకీ ఏనుగుల అంశంపై ఆంధ్రప్రదేశ్-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే సమక్షంలో.. ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీశాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగుల్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి.. మావటీలకు కావటీలకు శిక్షణ.. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు.. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం.. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్.. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.


ఎకో టూరిజంను అభివృద్ధి చేయడంలో కర్ణాటక తీసుకొచ్చిన విధానాలు ఏపీలో కూడా తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల పీసీసీఎఫ్‌లు కలిసి పనిచేస్తాయని.. పార్టీల పరంగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు వేరైనా.. ప్రజల కోసం కర్ణాటక ప్రభుత్వం సాయం అందించేందుకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. అలాగే వంద కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో సీజ్ చేశారని.. ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తున్నారన్నారు. ఏపీకి కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని.. దసరా తర్వాత మావటిల సాయంతో ఏనుగుల్ని పంపిస్తామని చెప్పారు కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే.


కర్ణాటకతో జరిగిన ఒప్పందం ప్రకారం.. 8 కుంకీ ఏనుగులు ఏపీకి రానున్నాయి. వీటిని పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. మన్యం ప్రాంతాలు, చిత్తూరు అటవీ ప్రభావిత ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పొలాలతో పాటుగా జనారణ్యంలోకి వస్తున్నాయి. దీంతో భారీగా నష్టం జరుగుతోంది.. ఏనుగుల దాడులతో రైతులు, స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది రైతులు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌ను కలిసి చెప్పారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏనుగుల బెడద నుంచి ప్రజల్ని రక్షించేందుకు చర్యలపై చర్చించారు.


అటవీశాఖ అధికారులు కుంకీ ఏనుగుల గురించి చెప్పడంతో.. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆయనే స్వయంగా బెంగళూరు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల దాడులు అరికట్టేందుకు.. 8 కుంకీ ఏనుగుల్ని పంపాలని రిక్వెస్ట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల్ని పంపేందుకు అంగీకరించింది. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేలు ఒప్పందం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com