ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ,,,, చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 07:13 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే వైఎస్ జగన్‌ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ చెప్తోంది. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఐదుసార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. అలాంటి వ్యక్తికి డిక్లరేషన్ అవసరం ఏముందని అంటున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెళ్లే వైఎస్ జగన్‌కు డిక్లరేషన్ అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదని బదులిస్తున్నాయి.


ఈ క్రమంలోనే తిరుమలలో నియమ నిబంధనలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం గమనార్హం. తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంటే వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా చంద్రబాబు ట్వీట్ చేశారు.


"కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను". అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరోవైపు తిరుమల డిక్లరేషన్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. వైఎస్ జగన్ తిరుమల పర్యటన ప్రకటించినప్పటి నుంచి తిరుమలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి శ్రేణులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంయమనం పాటిస్తూ తిరుమల వెళ్లకపోవటమే మంచిదని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com