ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల కొండపై వెలసిన డిక్లరేషన్ బోర్డులు.. జగన్ పర్యటన రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 07:10 PM

తిరుమల కొండ అంతటా కొత్తగా డిక్లరేషన్ బోర్డులు వెలిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయంలో హైందవేతరుల ప్రవేశం గురించి నిబంధనలు ప్రకటిస్తూ తిరుమల కొండపై పలు చోట్ల పోస్టర్లు, బోర్డులు ఏర్పాటు చేశారు. హిందువులుకాని వ్యక్తులు తిరుమల ఆలయానికి రావాలనుకుంటే, తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వరుని పట్ల తమకు విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (డిక్లరేషన్) ఇవ్వాలని నిబంధన విధించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాలు, రిసెప్షన్ కార్యాలయం, అదనపు కార్యనిర్వాహరణాధికారి క్యాంప్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఈ ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.


మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం అధికారక ప్రకటన చేసింది. తిరుమలలో హైందవేతరులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ టీటీడీ నిబంధనలు విధించిన వేళ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి గల కారణాలను మీడియా సమావేశంలో వైఎస్ జగన్ వెల్లడించారు.


ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన కాసేపటికే తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోర్డులను టీటీడీ సిబ్బంది తొలగించడం గమనార్హం. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో వైఎస్ జగన్ శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో టీటీడీ డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది.


సెప్టెంబర్ 27న తిరుమలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకోవడంతో.. రెండు రోజుల ముందు నుంచే తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనసేన, బీజేపీ శ్రేణులు తిరుపతికి పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితిని గమనించి తిరుపతి పోలీసులు ఆంక్షలు విధించారు.


టీటీడీ డిక్లరేషన్‌పై ఏవరేమన్నారు..?


‘కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మనందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నాను. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


‘నేను హైందవ ధర్మాన్ని నమ్ముతా. నా పరమాత్ముడు శ్రీ వేంకటేశ్వరుడు. మా పాపాలు, కర్మల నుంచి కాపాడు దేవుడా అని ప్రార్థిస్తాం. ఎవరి మతానికి సంబంధించిన దేవుళ్లను వారి మతం వారు పవిత్రంగా చూస్తారు. వారి మతానికి సంబంధించిన దేవాలయాల్లో తప్పుడు పనులు చేస్తారా..? మా ధర్మాన్ని రక్షించుకుంటేనే, మా గుర్తింపు కాపాడుకోగలం. గుర్తింపుని, మా దేవాలయాన్ని, మా ధర్మాన్ని కాపాడుకొనడమే మా పెద్ద బాధ్యత. అడ్డుకునే వారందరిని నిర్మూలించాలని స్వామి వారిని కోరుకున్న. హిందువులందరూ ఏకం కావాలి. నాలో ఆవగింజంత ప్రహ్లాధలోని ఉన్నంత భక్తి ఉంటే, ఉగ్ర నరసింహుడై రాక్షసులను సంహరించాలని కోరుకున్న. ఈ అధర్మం, రాక్షసత్వం మా వల్ల కావడం లేదు’ - మాధవీలత, బీజేపీ నాయకురాలు


‘జగన్‌ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా? మన ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటాం. హిందువుల మనోభావాలు, విశ్వాసాలను ఆయన గౌరవించలేదు. గత ఐదేళ్లలో ఎన్నో పాపాలు జరిగాయి. ప్రక్షాళన జరగాల్సిందే. అందరం ఒక్కటై హిందూత్వాన్ని కాపాడుకోవాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలను పాటించాల్సిందే’- శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, సాధు పరిషత్‌ అధ్యక్షుడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com