ప్రత్యేకహోదా అంశం ఆంధ్రప్రదేశ్లో మరోసారి నిప్పు రాజేసింది. భావోద్వేగాలతో కూడిన అంశంగా... రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా మారిన ప్రత్యేక హోదా ఎపిసోడ్ మరోసారి తెరమీదకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ న్యాయవాది ఆత్యహత్యకు యత్నించారు. నంద్యాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అనిల్.. మొదటి నుంచీ ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. హోదాకోసం జరిగిన ప్రతి ఆందోళనలోనూ భాగస్వామి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ .. కేంద్రం తీరుకు నిరసనగా .. కోర్టు ఆవరణలోనే పురుగులు మందు తాగేశారు. దీంతో అక్కడిక్కడిక్కడే స్పృహ కోల్పోయాడు.
పురుగుల మందు తాగుతూ అనిల్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగం చేస్తున్నట్టు చెప్పాడు. విషయం తెలుసుకున్న తోటి లాయర్లు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం అతణ్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అనిల్ తన నొదుటిపై ‘‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’’ అనే నినాదాన్ని రాసుకోవడం విశేషం. ప్రత్యేక హోదా సాధనలో అనిల్ తనవంతు పోరాటం చేస్తున్నాడని సహచర న్యాయవాదులు చెప్పారు.ఆంద్రప్రదేశ్ విభజనచట్టం ప్రకారం ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని... ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదాపై నాన్చివేత ధోరణి అవలంభించింది. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అయితే, కేంద్రం తీరుపై ఏపీలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తీవ్రతరమైన ఆందోళనలు ఏదో ఒక రూపంలో నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ తాజాగా న్యాయవాది అనిల్ బలవన్మరణానికి యత్నించడంతో.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాష్ట్రంలో హోదా నిప్పు రాజుకుంది.