ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు వాళ్లు రెడ్లే కాదు.. వైఎస్ జగన్‌పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 08:49 PM

తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.ఈ వివాదంపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైసీపీ, కూటమి శ్రేణుల మధ్య వార్ నడుస్తోంది. ఇప్పుడు నేతలు సైతం ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అసలు రెడ్డే కాదంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తాత రాజారెడ్డి.. బ్రిటీషర్లకు గొడ్డు మాంసం సరఫరా చేసేవారంటూ బైరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


"వైఎస్ జగన్ తాత రాజారెడ్డి బ్రిటీష్ ఆర్మీని వదిలిపెట్టి వచ్చారు. ఆ తర్వాత బళ్లారి కంటోన్మెంట్‌కు, బ్రిటీషర్లకు గొడ్డు మాంసం సరఫరా చేసేవారు. కావాలంటే నా పాత స్టేట్‌మెంట్లు పరిశీలించండి. అసలు వాళ్లు రెడ్లు కాదు. నేను మొదటి నుంచే ఇదే చెప్తున్నా. తోక తగిలించుకుని తిరుగుతున్నారు. వైఎస్ జగన్ కులం, మతం మీద చర్చ జరగాలి. ఇంత జరిగిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేందుకే జగన్, ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్, నాస్తికులు ప్లాన్ ప్రకారం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న వందల దేవాలయాలపై దాడులు జరిగాయి. ఈ రకంగా ఎవరి పాలనలోనూ జరగలేదు. వీటన్నింటిపైనా విచారణ జరగాలి. వీటన్నింటిలోనూ ముద్దాయి జగన్." అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు.


మరోవైపు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత రాయలసీమ సాధన సమితిని స్థాపించి.. ప్రత్యేక రాయలసీమ కోసం పనిచేశారు. రాయలసీమకు నీటి కోసం ఉద్యమించారు. ఇక ఎన్నికలకు ముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి.. బీజేపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. అనంతరం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీచేసిన శబరి.. ఎంపీగా విజయం సాధించారు. టీడీపీలోకి తిరిగి వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తిరుమల లడ్డూ వివాదం తెరపైకి రావటంతో.. ఈ విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను బైరెడ్డి ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగాయని.. వీటిపైనా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com